నెయ్యి మరక జగన్‌కే!..

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిని కల్తీ చేసిన వైనం చాలా స్పష్టంగా బయటపడింది. ఐదు సంవత్సరాల పాటు అసలు నెయ్యే కాని నెయ్యిని భోలోబాబా డెయిరీ సరఫరా చేస్తే కళ్లు మూసుకుని కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు రిజెక్ట్ చేసినట్లుగా నటించడానికి కొన్ని రిజెక్ట్ చేసి.. అదే నెయ్యిని వేరే కంపెనీ పేరుతో మళ్లీ తీసుకున్నారు. ఇలాంటి విన్యాసాలన్నీ సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టుతో స్పష్టమయ్యాయి. రాష్ట్రం కన్నా ఎక్కువగా దేశ స్థాయిలో సంచలనం రేపడంతో జగన్ రెడ్డి పై హిందువుల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తోంది.దీంతో జగన్ రెడ్డిని కాపాడేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తన కంటే యోధుడు లేడన్నట్లుగా రంగంలోకి దిగారు.

కల్తీ నెయ్యి వ్యవహారంలో పడిన మరకకు తమ వాదనను వైసీపీ వినిపించడానికి ఒక్కటంటే ఒక్క బలమైన ఫేస్ లేదు. ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ లేడు. ఉన్న వాళ్లందర్నీ సజ్జల బయటకు గెంటేశారు. ఉన్నదంతా ఆయన ఒక్కడే. ఒక వేళ ఎవరైనా ఉన్నా.. వారికి సజ్జల చాన్స్ ఇవ్వరు. తానే రంగంలోకి దిగారు., ఇంగ్లిష్ లో తడబడుతూ.. తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ఎవరైనా వింటారా లేదా అన్నది పక్కన పెడితే.. ఆ వీడియోలో జగన్ రెడ్డికే నెయ్యి మరక అంటించేందుకు అవసరమైన దారి ఆయన చూపించారు.

సజ్జల సాక్షిలో పిట్టకథల్ని రాయడంలో, రాయించడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారు. కానీ కథలు ఎప్పుడూ కల్పితాలే. ఎంతో కాలం వాటిని ప్రజలు నమ్మరు. కానీ సజ్జలకు తెలియడం లేదు. అదే పిట్టకథ చెప్పే ప్రయత్నం చేశారు. కల్తీ నెయ్యి ని అసలు వాడలేదని.. వెనక్కి పంపారని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేయడానికి .. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అసలు ఇక్కడ ఈ కల్తీ నెయ్యి లో కమిషన్లు తీసుకుంది జగన్ రెడ్డి అని సీబీఐ ఇంకా చెప్పలేదు. వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వస్తోంది. కానీ జగన్ పాత్ర కూడా ఉందని సజ్జల తన మాటల ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పటి వరకూ ఆయన హయాంలో జరిగింది కాబట్టి జగన్ ను నిందిస్తున్నారు. కానీ జగన్ కే ఆ కమిషన్లు వచ్చినట్లుగా సజ్జల పరోక్షంగా చెబుతూండటం.. జగన్ ను టార్గెట్ చేస్తారని వాదన ప్రారంభించడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి.

సజ్జల ఆందోళనతో హడావుడిగా.. ఈ స్టేట్మెంట్ వీడియో రిలీజ్ చేసే సమయానికి ధర్మారెడ్డి తిరుపతిలో సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇచ్చారు. హైకమాండ్ ఒత్తిడి మేరకే ఆ నెయ్యిని కొనుగోలు చేశామన్నారు. ఆ హైకమాండ్ ఎవరో ఆయన చెప్పారో లేదో తెలియదు కానీ.. వైసీపీలో.. నాటి ప్రభుత్వంలో హైకమాండ్ అంటే జగన్ రెడ్డి మాత్రమే. అంటే ఈ కేసు కూడా అక్కడికే వస్తోందన్నమాట. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇంత అడ్డగోలుగా దోపిడీకి వాడేసిన నేతలు ఇంకెవరూ ఉండరేమో ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *