పవన్ ఖేరా అరెస్ట్పై వీడని ఉత్కంఠ: హైకోర్టులో ముగిసిన వాదనలు.. రేపే తీర్పు!
హైదరాబాద్ (E6TV ప్రతినిధి): కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన ఆరోపణల కేసులో ఖేరాకు ఊరట లభిస్తుందా? లేక అరెస్ట్ తప్పదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు ముగిశాయి. జస్టిస్ కె. సుజన తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
కోర్టులో జరిగిన కీలక వాదనలు ఇవే:
- ఖేరా తరఫు వాదన: సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. అసోం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు అని కొట్టిపారేశారు. అక్కడి కోర్టులను ఆశ్రయించే వరకు తన క్లయింట్కు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు రక్షణ) కల్పించాలని కోరారు.
- అసోం ప్రభుత్వం కౌంటర్: అసోం అడ్వకేట్ జనరల్ దేవాజిత్ సైకియా ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీ నివాసి అయిన ఖేరా, హైదరాబాద్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక గల కారణాలను ప్రశ్నించారు.

వివాదం నేపథ్యం ఏమిటి?
అసోం సీఎం భార్య రినికి భూయాన్ శర్మకు విదేశీ పాస్పోర్టులు, లెక్కచూపని ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అసోం పోలీసులు ఆయనపై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి బీఎన్ఎస్ (BNS) లోని 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని ఖేరా నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
బెదిరింపులకు భయపడను: పవన్ ఖేరా
మరోవైపు హైదరాబాద్లోని ఖేరా భార్య నీలిమ నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అజ్ఞాతం నుంచే ఒక వీడియో విడుదల చేసిన పవన్ ఖేరా.. సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకోవడం సరికాదు. నేను రాహుల్ గాంధీ సైనికుడిని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజాక్షేత్రంలో ప్రశ్నలు అడుగుతూనే ఉంటా.”
హైకోర్టు తీర్పు పవన్ ఖేరాకు అనుకూలంగా వస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6TV.

