
రాజకీయ రంగంలో రాజకీయ ప్రముఖులు కలవడం సహజమే. కానీ కొంతమంది కలయిక మాత్రం రాజకీయాలను షేక్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ అలాంటి పరిస్థితులనే తలపిస్తోంది. ఇంతకీ వీరి భేటీ దేనికి సంకేతం..? భేటీలో ఏ మాట్లాడుకున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొన్నేళ్లు ముందు వరకు వైయస్ జగన్, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించారు. అధికారం, మందీ మార్భలంలో అంతా హడావుడి. రెండేళ్ల ముందు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ కు గ్రహణం పట్టిందనే చెప్పాలి. కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం.. 2023 తెలంగాణలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో ఒకింత నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంది. ముందుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ సీటును కోల్పోయిన బీఆర్ఎస్.. రీసెంట్ గా జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికార, ధన బలం ముందు తేలిపోయింది.
ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని కేటీఆర్ ఎన్నికల సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నరని చెప్పుకొచ్చారు. మరోవైపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారి పై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. గతంలో కేసీఆర్ ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని విలీనం చేసుకున్నారో.. అదే ఫార్ములా ను రేవంత్ అనుసరించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ వేటు వేసే ముందు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
మరోవైపు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి .. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ముుందు తేలిపోయింది. అంతేకాదు ప్రతిపక్ష స్థానం దక్కకుండా ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఓ రకంగా రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో విపక్షంలో ఉన్న ఇద్దరు కీలక నేతలు వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో వైసీపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయానికి సంబంధించి పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గతంలో జగన్ గెలవడానికి.. బాబు ఓడిపోవడానికి పరోక్షంగా సహకరించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇద్దరు యువ నేతలు భేటి కావడం తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతోంది.

