
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. జనవరి నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు పూర్తయ్యాక తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఓటరు జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ పూర్తి చేసిన నేపథ్యంలో, ఈసారి మున్సిపల్ ఎన్నికలు కొత్త వార్డుల విభజనతో జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది.
జనవరిలో ఎన్నికలు జరిగితే, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారానికి దిగనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వేడి మరింత పెరగనుంది.

