
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత ఖలేదా జియా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు వెల్లడించాయి.
80 ఏళ్ల ఖలేదా జియా న్యుమోనియాతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
1945 ఆగస్టు 15న జన్మించిన ఖలేదా జియా, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియౌర్ రహమాన్ భార్య. భర్త హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, BNPకి నాయకత్వం వహించారు.
1991–1996, 2001–2006 మధ్య రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించిన ఖలేదా జియా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
దీర్ఘకాలంగా రాజకీయ వివాదాలు, కేసులతో పాటు అనారోగ్య కారణాలతో ఆమె గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఖలేదా జియా మృతితో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు దేశ, విదేశీ నేతలు ఆమె మృతిపై సంతాపం తెలిపారు.

