వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కంటతడి.. మీడియా సాక్షిగా వెక్కివెక్కి ఏడ్చిన ప్రతిపక్ష నేత!
విశాఖపట్నం: వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఒక్కసారిగా విలపించడం సంచలనంగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సంచలన ఆరోపణలను ఖండిస్తూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స కన్నీటి పర్యంతమయ్యారు.

అచ్చెన్న వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన బొత్స
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవి కేవలం “దిగజారుడు రాజకీయాలు” అని ఆయన అభివర్ణించారు.
- వాస్తవం ఇది: “వైఎస్ మరణించినప్పుడు జగన్ ఏపీలో లేరని అచ్చెన్న చెప్పడం పచ్చి అబద్ధం. ఆ రోజు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్ను నా భార్య ఝాన్సీ, నేను చెరోపక్క పట్టుకుని తీసుకొచ్చాం” అని ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బొత్స భోరున విలపించారు.
భావాద్వేగంలో మాట తడబడిన నేత..
వైఎస్సార్ పాదయాత్ర మొదలై నేటికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్తో తమకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని, ఆయన వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వవైభవం సాధించిందని గుర్తు చేశారు. మాట్లాడే క్రమంలో భావోద్వేగం ఎక్కువవ్వడంతో ఆయన కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది.
కూటమి నేతలకు హితువు:
“అధికారం ఉంది కదా అని, చేతిలో పత్రికలు, ఛానళ్లు ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు. రైతుల సమస్యలను గాలికి వదిలేసి, తన ఉనికిని కాపాడుకోవడం కోసం అచ్చెన్నాయుడు అహంకారంతో మాట్లాడుతున్నారు” అని బొత్స విమర్శించారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజకీయ సంప్రదాయం కాదని హితవు పలికారు.
వైఎస్ మరణంపై స్పష్టత:
వైఎస్ హెలికాప్టర్ గల్లంతైన నాటి నుంచి మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించే వరకు ప్రతి దశలోనూ తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని బొత్స వివరించారు. తన గుండెల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయని, కానీ తాము దిగజారుడు రాజకీయాలు చేసే రకం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది

