నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే
కాంగ్రెస్తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు
దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో తోపులాట
ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్
నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ దేశంలో అరాచక పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
నీట్ పరీక్ష అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్గా వ్యవహరిస్తోందని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని అన్నారు.
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం నిరసన కార్యక్రమం కొనసాగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, మండలాధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



