ప్రభుత్వ హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తున్నాం – బీజేపీ విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే
నిజామాబాద్ జులై 18: E6 tv NEWS (శివ ఠాకూర్).
విద్యార్థులను రెచ్చగొట్టేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.బీజేపీ కేంద్రంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడంలో ఎంపీ విఫలమయ్యారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సూచనలు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడంలో ఎంపీ సమాధానం చెప్పాలి – యువతను రెచ్చగొట్టే రాజకీయాలు మంచివి కావు:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పూర్తిగా కట్టుబడి ఉందని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు బీజేపీ మానుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి అన్నారు.విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టడం బాధ్యతాయుత రాజకీయాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి రంగాల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధిపై ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

జిల్లాకు ఒక పెద్ద పరిశ్రమను కూడా తీసుకురాలేని ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలు బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని నాగేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

