23 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత
పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
భైంసా జూలై 10: E6 న్యూస్: తిరుపతి గౌడ్
అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇండ్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
గత పదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆశించిన స్థాయిలో నిధులు అందలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ నీరజ్ కుమార్, సర్పంచులు సిరం సుష్మారెడ్డి, సిరం రాజమణి శ్రీనివాస్, అప్పాల రాకేష్, అశోక్, సుధాకర్, గంగాప్రసాద్, బాలాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

