Breaking News

రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం: గణేష్ బిగాల

హైదరాబాద్, జూలై 4 (E6 ప్రతినిధి):
మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పలు శాఖల్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా, పరిపాలనలో తనదైన ముద్ర వేసిన మహానీయుడిగా రోశయ్య ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని గణేష్ బిగాల తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, నాయకులు కె.వి.పి. రామచందర్ రావు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, దానం నాగేందర్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *