ఇందూరులో “గోమాత వైభవం” ప్రవచనం భక్తులను అలరించింది
చాగంటి సేవలు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయం: ఎమ్మెల్యే
గోవు మహిమను, భారతీయ సంస్కృతి విలువలను అద్భుతంగా వివరించిన చాగంటి
ఇందూరు, జులై 24: E6 tv NEWS (శివ ఠాకూర్).
లక్షలాది మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సనాతన ధర్మ విలువలను సమాజానికి చేరవేస్తున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు.ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నగర శివారులోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన “గోమాత వైభవం” ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి మహాగ్రంథాల్లోని ఆధ్యాత్మిక సందేశాలను సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో చాగంటి వివరించడం విశేషమన్నారు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, ధర్మం యొక్క గొప్పతనాన్ని నేటి తరానికి చేరవేయడంలో ఆయన చేస్తున్న సేవలు అమూల్యమని ప్రశంసించారు.
సనాతన ధర్మ పరిరక్షణకు చాగంటి కోటేశ్వరరావు చేస్తున్న కృషి ఒక మహాయజ్ఞమని పేర్కొన్న ఎమ్మెల్యే, ఇందూరులో “గోమాత వైభవం”పై ఆయన ప్రవచనం వినే అవకాశం లభించడం స్థానిక భక్తుల అదృష్టమన్నారు.గోవుకు సనాతన ధర్మంలో అత్యున్నత స్థానం ఉందని, ముక్కోటి దేవతల నివాసంగా గోవును భావిస్తారని తెలిపారు. శుభకార్యాల్లో గోదానం, గోవు పాలు, గోమూత్రం వంటి వాటి ప్రాముఖ్యతను చాగంటి తన ప్రవచనంలో విశదీకరించి, గోమాత మహిమకు సంబంధించిన ఎన్నో విశేషాలను భక్తులకు తెలియజేశారని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు, భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



