భీంగల్లో పోలింగ్ బూత్ల పరిశీలన.. కాంగ్రెస్ నాయకులకు కీలక సూచనలు
భీంగల్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో ఆయన శుక్రవారం అత్యవసరంగా భీంగల్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి వార్డుతో పాటు 171వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన నాగేష్ రెడ్డి, ఇంటింటికీ కొనసాగుతున్న ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో మాట్లాడి నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులు పూర్తిచేయించి ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న నాగేష్ రెడ్డి, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా కాంగ్రెస్ నాయకులు, బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

