రాత్రివేళల్లో జోరుగా తరలింపు జరుగుతోందని స్థానికుల ఆరోపణలు
అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్
కోటగిరి జూలై 13: E6 న్యూస్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ మంజీరా నది లో నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతోందని వారు చెబుతున్నారు.
పోతంగల్ నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు, స్థానిక ట్రాక్టర్ల ద్వారా, ప్రత్యేక వాహనాల ద్వారా భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా రాత్రి వేళలో ఇంత పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి తనిఖీలు, చర్యలు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
మంజీరా నది నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

