కరీంనగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం

ఎన్‌టిఆర్‌ భవన్‌లో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత


కరీంనగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం

ఎన్‌టిఆర్‌ భవన్‌లో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మృతి చెందిన ఎన్‌టిఆర్‌ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కరీంనగర్‌కు చెందిన కళ్యాడపు ఆగయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఈ ఆర్థిక సహాయాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు బుధవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో కళ్యాడపు ఆగయ్య కుమారుడు కళ్యాడపు నరేష్‌, కోడలు కళ్యాడపు రవళికి అందజేశారు.

ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ, కళ్యాడపు ఆగయ్య ఎన్‌టిఆర్‌కు వీరాభిమానిగా, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసిన నిబద్ధత గల కార్యకర్త అని అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన వ్యక్తిత్వం పార్టీలో అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.

ఎన్‌టిఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ప్రజల అవసరాలకు అనుగుణంగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. తెలంగాణలో 2014లో 15 మంది, 2018లో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచినప్పటికీ, వారిని బీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లి పార్టీని బలహీనపరచాలని కేసీఆర్‌ ప్రయత్నించారని విమర్శించారు. అయితే 2023 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ చంద్రబాబు గారి పేరు, తెలుగుదేశం పార్టీ పేరును ప్రస్తావిస్తూ అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మనసుల్లో తెలుగుదేశం పార్టీ ఉందని స్పష్టం చేశారు. పార్టీ నుంచి లబ్ధి పొందిన నాయకులు వెళ్లిపోయినా లక్షా 80 వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడం గమనార్హమని, ఇందులో కొత్త సభ్యత్వాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం ఖాయమని అన్నారు.

భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. నారా లోకేష్‌ గారు మొట్టమొదటిసారిగా ‘కార్యకర్తల సంక్షేమ నిధి’ని ఏర్పాటు చేసి, ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఈ కార్యక్రమాలను ఇతర పార్టీలు కూడా అనుసరిస్తున్నాయని అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలైనప్పటికీ, బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీని, నాయకులను, కార్యకర్తలను పరాయి వారిలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనిని కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా తిప్పికొట్టాలని, పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పార్టీ కన్వీనర్‌ వంచె శ్రీనివాస్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లూరి దుర్గాప్రసాద్‌, జనగామ నర్సింగ్‌రావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

— తెలుగుదేశం ప్రకాశ్‌ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *