Breaking News


“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు

E6TV WEB NEWS | హైదరాబాద్

“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు

హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు.

అరుణ మాట్లాడుతూ — “మోదీ ప్రభుత్వం కరీంనగర్, వరంగల్ నగరాల అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ కింద కోట్లాది రూపాయలు ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ నిధులను సరిగ్గా వినియోగించలేదు. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది” అన్నారు.

“వరంగల్ నగరంలో వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీ నిధులు సరైన విధంగా వాడి ఉంటే, ఈరోజు వరంగల్ ఇలా జలమయమయ్యేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది” అని ఆమె చెప్పారు.

అరుణ ఇంకా పేర్కొన్నారు — “2024లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్లు వరద సాయం (NDRF) కింద ఇచ్చింది. అందులో తెలంగాణకు రూ.416.80 కోట్లు ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ డబ్బు ఎక్కడుంది?” అని ప్రశ్నించారు.

రైతులు వడ్లను ఆరబోస్తూ మార్కెట్ యార్డుల్లో కష్టపడుతున్నారని, పంటలు నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రతిసారి ప్రకటనలు చేస్తూ, పర్యటనలతో సరిపెట్టుకోవడం కాదు — రైతుల కష్టాలను నిజంగా అర్థం చేసుకోవాలి. లేనిపక్షంలో బీజేపీ రైతుల పక్షాన పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తుంది” అని డీకే అరుణ హెచ్చరించారు.

(పత్రికా ప్రకటన ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *