ముధోల్, జూలై 8: E6 న్యూస్ (తిరుపతి గౌడ్)
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఆచార్యులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భైంసా పట్టణంలోని శ్రీకర్ హాస్పిటల్కు చెందిన పిల్లల వైద్య నిపుణులు డా. దయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన ఆహారం, తాగునీటి వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరించారు.
అనంతరం స్థానిక వైద్యులు డా. భాస్కరోళ్ల కృష్ణ మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డా. నర్సయ్య, జాదవ్ పవన్, పాఠశాల అధ్యక్షులు కొండా సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశోకాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం సీజనల్ వ్యాధులపై విలువైన అవగాహన కల్పించిన వైద్యులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది.

