కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ మిల్లుల గోదాముల్లో విస్తృత తనిఖీలు
మద్నూర్ ఆగస్టు 9: (E6 tv NEWS: M, మస్నాజీ)
అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్ఐ నాగేష్ తెలిపారు. మండలంలోని కల్లు దుకాణాలు, దాబా హోటళ్లు, రైస్ మిల్లుల గోదాముల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
కల్లు దుకాణాల్లో కల్లు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించినట్లు ఎస్ఐ తెలిపారు. దాబా హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారా అనే అంశంపై తనిఖీలు నిర్వహించారు. రైస్ మిల్లుల గోదాములను పరిశీలించి మాదకద్రవ్యాలకు సంబంధించిన వస్తువులు లేదా ఇతర అనుమానాస్పద పదార్థాలను నిల్వ చేశారా అనే విషయాన్ని ఆరా తీశారు.


అదేవిధంగా మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆబ్కారీ చెక్పోస్ట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ మద్యం, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్ఐ నాగేష్ స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది దేవిసింగ్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

