పరిశుభ్రత, నిర్వహణపై ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు ప్రశంసలు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజం సహకరించాలి
భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి)
సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉండి ఇంటి వాతావరణాన్ని తలపిస్తోందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం పాఠశాలల సందర్శనలో భాగంగా ఆయన సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, ప్రాంగణం, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక దాత బి. సుబ్బరాజు అందజేసిన ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలను విద్యార్థులకు ఎంఈఓ చేతుల మీదుగా అందజేశారు.బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ పాఠశాలను సమాజం గుర్తించి అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల అన్ని రకాల అవసరాలను ప్రభుత్వపరంగా అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పాఠశాలలకు గ్రామస్తులు, దాతలు తమ సహాయ సహకారాలు అందించి గుణాత్మకమైన విద్య సాధనకు తోడ్పడాలని కోరారు.ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయడంపై రాష్ట్ర ఉన్నతాధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా సమిష్టి కృషితో ముందుకు సాగుతున్నారని, ప్రతి ఒక్కరి సహకారంతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. రామకృష్ణ, కే. కరుణకుమార్, దాత బి. సుబ్బరాజు, TAPRPA అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు, కేఎస్ఎల్వీ ప్రసాద్, జి. భూషణరావు, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, దామోదర్రావు, పాఠశాల స్వచ్ఛ మిత్ర సేవకుడు జి. దిలీప్కుమార్, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు పి. మౌనిక తదితరులు పాల్గొన్నారు.



