ఘనంగా శోభాయాత్ర.. ఉత్సాహంగా దహీ హండి
డోంగ్లి, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).
జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రచార్య సంస్థానం అంతర్గత తెలంగాణ ఉపపీఠము, కామారెడ్డి జిల్లా డోంగ్లి సంత సంఘ సేవా కేంద్రం ఆధ్వర్యంలో గత 21 రోజులుగా నిర్వహించిన శ్రీ లీలామృత గ్రంథ పారాయణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.జగద్గురు శ్రీ గారు రచించిన పవిత్ర శ్రీ లీలామృత గ్రంథాన్ని భక్తులు గత 21 రోజులుగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ సందర్భంగా శనివారం గ్రంథ సమాప్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డోంగ్లి గ్రామంలో జగద్గురు శ్రీ వారి నామస్మరణ, భజనలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.
భక్తుల నినాదాలు, భజనలతో గ్రామంలోని వీధులు మార్మోగగా.. శోభాయాత్ర భక్తిమయ వాతావరణంలో కోలాహలంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగద్గురు శ్రీ వారి నామస్మరణ చేశారు.అదేవిధంగా శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని డోంగ్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద దహీ హండి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దహీ హండిని పగలగొట్టి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపపీఠం సభ్యులు, కామారెడ్డి జిల్లా పదాధికారులు, డోంగ్లి గ్రామ కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

