నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి
హుజూర్నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి).
హుజూర్నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. ఆసుపత్రి, నివాస ప్రాంతాలకు సమీపంలో టవర్ నిర్మాణానికి అనుమతులు ఎలా మంజూరయ్యాయో సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
టవర్ నిర్మాణంపై కాంట్రాక్టర్ను ప్రశ్నించగా, అన్ని అనుమతులు ఉన్నాయని, పనులు నిలిపివేసే ప్రసక్తే లేదని సమాధానం ఇచ్చినట్లు స్థానికులు ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం కొనసాగించడం సరికాదని వారు పేర్కొన్నారు.ప్రజారోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సెల్ టవర్కు సంబంధించిన అనుమతులు, నిబంధనలను అధికారులు సమగ్రంగా పరిశీలించి, విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణ పనులను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

