భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి).
సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు.
వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి రెసిడెన్షియల్ విధానంలో సివిల్స్ పరీక్షకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు వివరించారు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా welfare.sriramsias.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సివిల్స్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని పీఓ రాహుల్ ఆకాంక్షించారు.

