జూనియర్ న్యాయవాదిగా ప్రతిభకు గుర్తింపు
హుజూర్నగర్,సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి).
నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, హుజూర్నగర్ పట్టణానికి చెందిన అడ్వకేట్ యరగాని సోనీ ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డును అందుకున్నారు. కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్ అసోసియేషన్, కాళోజీ తెలంగాణ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదుల ప్రతిభ, వృత్తి పట్ల అంకితభావాన్ని గుర్తిస్తూ జిల్లా నుంచి ఒకరిని ఎంపిక చేసి ఈ అవార్డును అందజేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది నాంపల్లి క్రిమినల్ కోర్టులో జూనియర్ న్యాయవాదిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన యరగాని సోనీని కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు కాళోజీ నంది అవార్డును అందజేశారు.యరగాని సోనీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించడంపై ఆమె తల్లిదండ్రులు యరగాని సత్యనారాయణ గౌడ్, ఉమా, కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ న్యాయవాద వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ కుమార్, యరగాని శ్రీనివాస్, బెల్లంకొండ రమేష్, తుమ్మ వెంకటేశ్వర్లు, భరద్వాజ్, పరాషర్, వట్టికూటి వెంకటేశ్వర్లు, వట్టికూటి గురవయ్య, మధు, శ్యాంప్రసాద్, నవీన్, హరీష్, ప్రశాంత్, శ్రీజ, శాన్వి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

