భీంగల్లో కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
భీంగల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి).
ఒకవైపు దళితులపై దాడులు జరుగుతుంటే, మరోవైపు దళిత స్పీకర్పై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్గా ఉన్న వ్యక్తి కేవలం ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మాత్రమే కాదని, సామాజిక అవమానాలు, ఎన్నో కష్టాలు, పోరాటాలను అధిగమించి ఆ స్థాయికి ఎదిగిన దళిత బిడ్డ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక గౌరవానికి విరుద్ధమని అన్నారు.స్పీకర్ కంట కన్నీరు రావాల్సిన పరిస్థితి కల్పించడం ఆయన ఓటమి కాదని, అలా మాట్లాడిన వారి సంస్కారానికి ఓటమి అని వ్యాఖ్యానించారు. ఆ కన్నీరు ఒక్క వ్యక్తిది కాదని, దళిత సమాజం ఎదుర్కొంటున్న అవమానాలు, ఆవేదనకు ప్రతీక అని అన్నారు.
గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు దళిత స్పీకర్ను అసెంబ్లీలో అవమానించే పరిస్థితి రావడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దళితుల పట్ల వివక్షను సహించేది లేదని స్పష్టం చేశారు.
“అధికారం మీది కావచ్చు.. కానీ అవమానం మాది కాదు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలే తగిన సమాధానం చెబుతారు” అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.


