కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత
కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టుల్లో శనివారం (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత తెలిపారు.జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
పరస్పర అంగీకారంతో కేసులను త్వరితగతిన, సులభంగా, ఉచితంగా లేదా స్వల్ప వ్యయంతో పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. తద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

