కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి).
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.అదేవిధంగా పాల్వంచ 46వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు. ప్రధానంగా వీధి దీపాలు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, వీధి కుక్కల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ముత్యాల ప్రవీణ్ కుమార్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరఫున నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.

