Breaking News

ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం

నిజామాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం..

క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS శివ ఠాకూర్.

ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వమే వారిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు విపుల్ రావు, రాజ్ గణేష్, కలిగోట్ ప్రశాంత్, మహేష్, దినేష్, రఘు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *