నిజామాబాద్, సెప్టెంబర్ 9: (E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రముఖ తెలంగాణ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ నారాయణరావు గారు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. కాళోజీ రచనల్లో తెలంగాణ ప్రజల జీవన విధానం, యాస, భాష ప్రతిబింబించాయని పేర్కొన్నారు.ఆయన సేవలకు గుర్తింపుగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.
కాళోజీ నారాయణరావు గారి ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూపరింటెండెంట్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



