బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).
గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర సామాగ్రి అందడం లేదని విద్యార్థులు తెలిపారు.
ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో పాటు, శుక్రవారం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జాదవ్ ప్రవీణ్ నాయక్, IDCMS మాజీ చైర్మన్ బాధవత్ తారాచంద్ నాయక్, కమిటీ సభ్యులు విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.అనంతరం వసతి గృహ వార్డెన్, సిబ్బందితో మాట్లాడిన నాయకులు.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, మరుగుదొడ్లను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన నోటుబుక్కులు, దోమతెరలు, మ్యాట్లు, ఇతర సామాగ్రిని సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు

.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర బంతిలాల్ నాయక్, ఉపాధ్యక్షుడు బర్మావత్ నరేష్ నాయక్, బంజారా యువ నాయకుడు మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

