ఆగస్టు 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దారి మళ్లింపు
ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసుల సూచన
నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్).
ఊర పండగ సందర్భంగా ఆగస్టు 2న నిర్వహించే ఊరేగింపును పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఖిల్లా చౌరస్తా నుంచి ఊరేగింపు ప్రారంభమై వివేకానంద విగ్రహం, గాజులపేట, గురుద్వారా, లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్, దుబ్బా ప్రాంతాల వైపు కొనసాగనుంది.దీంతో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను బైపాస్ మార్గంలో మళ్లించనున్నట్లు తెలిపారు. ఈ వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, జడ్పీ చౌరస్తా, కంటేశ్వర్, మీ-సేవ, కంటేశ్వర్ బైపాస్, ఐడీఓసీ, అర్సపల్లి మీదుగా బోధన్ వైపు ప్రయాణించాలని సూచించారు.అయితే హైదరాబాద్, బాన్సువాడ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తమ మార్గాల్లోనే ప్రయాణించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.
ఊర పండగ సందర్భంగా నగర ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించి, ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ విజ్ఞప్తి చేశారు.

