రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం
కొత్తగూడెం:, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష హత్య, అత్యాచారం ఘటనపై కార్యాచరణ రూపొందించేందుకు సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలిపారు.సోమవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆదివాసీ యువతిని అత్యంత దారుణంగా హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి ఘటనలు మానవ సమాజానికే మచ్చగా నిలుస్తాయని, దారుణ ఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా, సామాజిక సంఘాల ప్రతినిధులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఘటనపై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాజకీయ పక్షాలు, ప్రజా, సామాజిక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని సాబీర్ పాషా కోరారు.

