రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ
న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ ప్రతినిధి బృందంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశంలో ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాల విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య అవకాశాల పెంపు, ఉపాధి కల్పనకు ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే మార్గం అత్యంత కీలకమని ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రికి వివరించారు.
వినతిపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధి బృందం వెల్లడించింది.ఈ రైల్వే ప్రాజెక్ట్ అమలులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, ఉపాధి రంగాలకు ఊతం లభిస్తుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్కు త్వరలోనే పరిపాలనా ప్రక్రియలు వేగవంతమై కార్యరూపం దాల్చాలని వారు కోరుతున్నారు.


