Breaking News

విద్యా.. వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి

పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూడాలి.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు

జుక్కల్, ఆగస్టు 28: (E6tv NEWS: ప్రతినిధి).
నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంత రావు అన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), వైద్యాధికారులతో (MOలు) ఎమ్మెల్యే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

పీహెచ్‌సీల్లో మందుల లభ్యతపై ఆరా

వైద్యాధికారులతో జరిగిన సమీక్షలో నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల లభ్యతపై ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రస్తుతం సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం

విద్య, వైద్యం అనేవి ప్రతి కుటుంబానికి అత్యంత కీలకమైన అంశాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం అందించడమే మన ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *