కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికి, భారత ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ‘సద్భావన దివస్’ ప్రతిజ్ఞ చేశారు. కుల, ప్రాంత, మత, భాష భేదాలు లేకుండా దేశ ప్రజల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. విభేదాలను హింసకు తావులేకుండా చర్చలు, రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.జాతీయ సద్భావన, ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, TPCC జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ఐరని సందీప్ కుమార్, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి జిల్లాలోని మండల, టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

