Breaking News

నీట్‌లో ప్రతిభ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు

గిరిజన విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సహాయం

అభినందించిన ఐటీడీఏ పీవో బి. రాహుల్

భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థిని భూక్య వాసిని నీట్ అడ్వాన్స్–2026లో ప్రతిభ కనబరిచి, స్టేట్ ర్యాంక్ 1962 సాధించి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

సోమవారం తన ఛాంబర్‌లో విద్యార్థినిని అభినందించిన పీవో.. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించి, నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం గర్వకారణమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.విద్యార్థిని ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవసరమైన అడ్మిషన్ (అక్సెప్టెన్స్) ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాల కొనుగోలు ఖర్చుల కోసం ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

ఈ సందర్భంగా పీవో బి. రాహుల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినికి సూచించారు. ఆమె విజయం తోటి గిరిజన విద్యార్థినులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, అకౌంట్ ఆఫీసర్ సంతోష్, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *