1976–77 పదవ తరగతి బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా.. గురువులకు ఘన సన్మానం.. మధుర జ్ఞాపకాలతో సందడి
నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: (శివ ఠాకూర్).
నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో 1976–77 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ ఆత్మీయ కలయికలో పూర్వ విద్యార్థులంతా కుటుంబ సభ్యుల్లా కలిసి ఆనందోత్సాహాలతో గడిపారు.
ఈ సందర్భంగా పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా మార్గనిర్దేశం చేసిన గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడిన పూర్వ విద్యార్థులు, అర్ధ శతాబ్దం తర్వాత అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కలయిక జీవితాంతం మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
అనంతరం వయసును మరిచి డీజే సంగీతానికి ఆటపాటలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలను మరింత ఉల్లాసభరితంగా మార్చారు. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ పాత స్నేహాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలు పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచాయి.





