జగిత్యాల జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యమని వెల్లడి
జగిత్యాల, ఆగస్టు 1: (E6 tv NEWS ప్రతినిధి).
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ధ్యేయమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి వేణుగోపాల్ పేర్కొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొల్లంపల్లి సంపత్కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాపర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేసేందుకు త్వరలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఎస్పీ అత్యధిక స్థానాల్లో పోటీ చేసి, జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.బడుగు, బలహీన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నాయకులు ఆయా వర్గాల అభ్యున్నతిని విస్మరిస్తున్నారని విమర్శించిన ఆయన, ఇకపై అలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వబోమన్నారు. “ఓట్లు మావి… సీట్లు మీవా?” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో బీఎస్పీ సత్తా చాటుతామని రాపర్తి వేణుగోపాల్ స్పష్టం చేశారు.


