ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ
మద్నూర్, ఆగస్టు 4: E6 tv NEWS (M. మస్నాజీ)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం ఆదేశించింది. బస్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్ తెలిపారు.
గ్రామంలోని ప్రధాన రహదారిని కొందరు ఆక్రమించుకోవడంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రహదారిని ఆక్రమించిన వారందరికీ మంగళవారం తొలగింపు నోటీసులు జారీ చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ, రహదారికి ఇరువైపులా ఆక్రమణలు చేసిన వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. రహదారి విస్తరణతో పాటు సీసీ రోడ్డు నిర్మాణం సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

