దాతల సహకారంతో ట్రై సైకిల్ అందజేసిన ఎస్ఐ నరేష్
హుజూర్నగర్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి).
ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ హుజూర్నగర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని తిలక్నగర్ కాలనీకి చెందిన వికలాంగుడు ఇందిరాల పిచ్చయ్యకు దాతల సహకారంతో నూతన ట్రై సైకిల్ను అందజేశారు.
పిచ్చయ్య గత నెలలో తన ఇంటి ఎదుట ట్రై సైకిల్ను పార్కింగ్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో అది తీవ్రంగా దెబ్బతింది. దీంతో ట్రై సైకిల్ వినియోగానికి పనికిరాకపోవడంతో పిచ్చయ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు స్పందించి, ఆయన దైనందిన అవసరాలకు ట్రై సైకిల్ ఎంతో అవసరమని గుర్తించారు. దాతల సహకారంతో నూతన ట్రై సైకిల్ను సమకూర్చి శనివారం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ నరేష్ చేతుల మీదుగా పిచ్చయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. దాతల సహకారంతో వికలాంగుడికి ట్రై సైకిల్ అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్యక్రమంలో హుజూర్నగర్ టూ టౌన్ ఎస్ఐ హనుమాన్ నాయక్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, జానీ మియా తదితరులు పాల్గొన్నారు.


