నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్).
హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ భుజంగరావు బుధవారం ప్రారంభించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజశ్రీతో కలిసి ఐఐఈసీ (Intensified Information, Education & Communication) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రజలు తమ ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘Break Free’ యాప్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రెండు నెలల పాటు జిల్లావ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 200 కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు, అలాగే 200 ఎంపిక చేసిన గ్రామాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు యువతలో అవగాహన పెంపొందించేందుకు బైక్ ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవి నాగేశ్వరి, టిబీ నియంత్రణ అధికారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ, హెల్త్ ఎడ్యుకేటర్ గన్పూర్ వెంకటేష్, డీపీఎం సుధాకర్, సీపీఓ మొహిజ్ అహ్మద్, సీఎస్ఓ నవీన్, స్నేహ సొసైటీ సిద్దయ్య, డీపీఓ విశాల, హెచ్ఈఓ గోవర్ధన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు స్నేహ సొసైటీ, వర్డు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వైఆర్జీ తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



