నిజామాబాద్, ఆగస్టు 21: (E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయినగర్ షిర్డీ రైలులో RPF పోలీసులు, నిజామాబాద్ SHO ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. సూట్కేసులను తనిఖీ చేయగా మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు.పోలీసుల విచారణలో తాము ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తరలిస్తున్నామని నిందితులు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రవాణా కోసం గుర్తుతెలియని వ్యక్తి తమకు రూ.10 వేల నగదు ఇచ్చి, షిర్డీలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆటో సిద్ధంగా ఉంటుందని, గంజాయిని ఆ ఆటోలో పెట్టి వెళ్లాలని సూచించినట్లు వారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టైన నిందితులు:
- గణేష్ పోలి (20), కుమార్ పోలి కుమారుడు, కలిమేఘి, జగిలిపడే పోస్టు, కోడాలా సబ్డివిజన్, గంజాం జిల్లా, ఒడిశా.
- దీపక్ సాహు (21), లోచన్ సాహు కుమారుడు, జగిలిపడే పోస్టు, గంజాం జిల్లా, ఒడిశా.
స్వాధీనం చేసుకున్నవి:
- 24.3 కిలోల ఎండు గంజాయి
- 2 మొబైల్ ఫోన్లు
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ మల్లేష్, RPF ఎస్ఐ వెంకటేశ్వర్లు, పీఈసీ సిబ్బంది శైలేష్, సలీం, దేవేందర్తో పాటు RPF సిబ్బంది పాల్గొన్నారు.


