కామారెడ్డి: సివిల్ సప్లై అధికారుల వేధింపులు వెంటనే నిలిపివేయాలని, సీఎంఆర్ (CMR) బియ్యం చెల్లింపునకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించాలని ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పలు మండలాల రైస్ మిల్లర్ల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సంఘ అధ్యక్షుడు శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి నిశాంత్ సేట్ మాట్లాడారు.
ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశంతో నాణ్యత లేని, తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తీసుకుంటున్నామని, దానివల్ల నూక శాతం పెరిగి తీవ్రంగా నష్టపోతున్నామని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లింగ్ సమస్యల సమయంలో అధికారులు తమను వేధించడం, కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. కరెంటు, హమాలీ చార్జీలు పెరిగినా ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలు ఇవ్వడం లేదని, స్టోరేజ్ గోదాముల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చినా సమస్య తీరకపోతే రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.

