డీజేలకు అనుమతి లేదు.. మండపాల వద్ద గొడవలకు నిర్వాహకులదే బాధ్యత: ఎస్ఐ నరేష్
హుజూర్నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని భక్తి భావంతో పండుగను నిర్వహించుకోవాలని హుజూర్నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ సూచించారు. మండపాలను రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి పొందాలని తెలిపారు.
మండపాల వద్ద అశ్లీల పాటలు, నృత్యాలు నిర్వహించరాదని, డీజే సౌండ్ సిస్టమ్కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద గొడవలు, కొట్లాటలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.పీర్లకొట్టం వద్ద జరిగిన వివాదంలో నిమ్మతోట బజార్కు చెందిన ఇరువర్గాల 13 మంది యువకులపై తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు ప్రతి రోజు మండపాల వద్ద కనీసం నలుగురు కమిటీ సభ్యులు ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

