మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అంతమొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చావును కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన… షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు.
ప్రశాంత్ రెడ్డి విమర్శల్లోని ముఖ్యాంశాలు:
- మంత్రివర్గ, సీఎం ఆలోచనే: కేసీఆర్ నివాసమైన ఎర్రవెల్లి ఫామ్హౌస్ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని, ‘చావు డప్పు’ కొడతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు.
- సభా సంప్రదాయాలకు తిలోదకాలు: అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజాప్రతినిధులను సభకు రానివ్వకుండా, ఫామ్హౌస్పై కాంగ్రెస్ శ్రేణులతో దాడులు చేయించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
- బేషరతు క్షమాపణ చెప్పాలి: తెలంగాణ పితామహుడు కేసీఆర్ చావు గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- డీజీపీ సుమోటో కేసు నమోదు చేయాలి: మాజీ సీఎం ప్రాణాలకు హాని తలపెట్టేలా వ్యాఖ్యలు చేసి, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంలపై డీజీపీ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

