Breaking News

కట్టుదిట్టమైన భద్రత మధ్య బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక



దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం ఎన్నిక – ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి


బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి పారదర్శకత మధ్య జరిగింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తం 39 మంది సభ్యులు హాజరైన సమావేశంలో నాలుగు కో-ఆప్షన్ పదవులకు 35 దరఖాస్తులు రాగా, నిబంధనల ప్రకారం చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్నిక ప్రక్రియ అనంతరం 12 మంది ఎంఐఎం కౌన్సిలర్లు బహిష్కరణ ప్రకటించి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

మెజారిటీ సభ్యుల మద్దతుతో దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగంలు కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ జాదవ్ కృష్ణ ప్రకటించారు. అనంతరం నూతన సభ్యులకు నియామక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, ఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *