నల్గొండ :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్, తాగునీరు, సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్ తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలోని సోలేపేట్ విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సబ్స్టేషన్ లాగ్బుక్ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
ముఖ్య విషయాలు:
- తాగునీటి ఎద్దడి: మిషన్ భగీరథ ద్వారా నీరు ఇవ్వకపోవడంతో రెండ్రోజులకోసారి మాత్రమే తాగునీరు వస్తోందని స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారన్నారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, కామారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందన్నారు.
- వ్యవసాయానికి విద్యుత్ కోతలు: గతంలో 14 నుండి 15 గంటలు ఇచ్చిన విద్యుత్ను ఇప్పుడు 12 గంటలకే కుదించారని, ఆ సమయంలో కూడా తరచూ ట్రిప్పింగ్ అవుతోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు’ అన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు.
- థర్మల్ విద్యుత్ కేంద్రాలు బంద్: బొగ్గు కొరత నెపంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 1,600 మెగావాట్లు, భద్రాద్రి ప్లాంట్లో 270 మెగావాట్లు.. మొత్తం 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, కేవలం ప్రభుత్వానికి “రాజకీయ ఇచ్చాశక్తి” కొరత మాత్రమే ఉందన్నారు.
- రైతు బీమా రావట్లేదు: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,000 రైతు కుటుంబాలకు గత 5 నెలలుగా రైతు బీమా (రూ. 5 లక్షలు) అందలేదని, ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
అవాంతరాలు లేని 24 గంటల విద్యుత్, రోజూ తాగునీటి సరఫరా మరియు రైతు బీమా క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

