ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విజయవాడలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రారంభించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర, అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు.
రూ. 250 కోట్లతో 22 హెల్త్ ప్రాజెక్టులు వర్చువల్గా ప్రారంభం ఈ కార్యక్రమంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 22 ఆరోగ్య ప్రాజెక్టులను జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని నేతలు స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏపీ వైద్య రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

