40 కోట్ల సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములు కావాలి
ఈనెల 27న గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ యాత్రను విజయవంతం చేయండి: రాజ్ పురోహిత్ సింగ్
నిజామాబాద్ జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.
గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలోని శ్రీకృష్ణ మందిర్ గోశాల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ జిల్లా ప్రతినిధులు రాజ్ పురోహిత్ సింగ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎల్. రాజు మాట్లాడుతూ, దేశంలోని సాధు–సంతుల ఆలోచన మేరకు గోమాతకు రాష్ట్ర మాత హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది హిందూ బంధువుల సంతకాలను సేకరించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లకు పంపించనున్నట్లు తెలిపారు. దేశ ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇందూరు జిల్లాలో సంతకాల సేకరణను ప్రారంభించినట్లు వెల్లడించారు. హిందూ బంధువులు, ధార్మిక సంఘాలు, గోభక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈనెల 27న సోమవారం నగరంలోని ధర్నా చౌక్ సమీపంలోని గణేష్ మందిర్ వద్ద నుంచి గో సమ్మన్ ఆహ్వాన యాత్ర ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు, గోభక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ జిల్లా ప్రతినిధులు ముక్క జయకృష్ణ, అల్లాడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

