కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం నిర్వహించిన ఇల్లందు కాంగ్రెస్ శ్రేణులు
ఇల్లందు: హైదరాబాద్లోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఊకే శిరీష పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి జగదాంబ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్లో మానవహారం చేపట్టి శిరీషకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
అనంతరం శిరీష చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఘటనకు బాధ్యుడైన నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



