తెలంగాణ శాసనసభ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి సూచనలతో నిజాంపేట సర్కిల్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో దళిత సంఘాలు మరియు కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
273వ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రోళ్ల విష్ణు, గజ్జల మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి తమ నిరసన తెలిపారు.
నిరసన కార్యక్రమంలో నేతల కీలక వ్యాఖ్యలు:
- దళిత స్పీకర్కు అవమానం: రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న దళిత బిడ్డ, స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్రావులు అనుచితంగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు.
- బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరి: గత పదేళ్ల పాలనలో కేసీఆర్ దళితులను తీవ్రంగా అవమానించారని, గతంలో దళిత డిప్యూటీ సీఎంను పదవి నుంచి తొలగించిన చరిత్ర వారిదని విమర్శించారు.
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత: కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితులకు పెద్దపీట వేస్తూ ఒకరికి స్పీకర్, మరొకరికి డిప్యూటీ సీఎం, ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు.
- సభా సంప్రదాయాలకు విరుద్ధం: చట్టసభల ప్రాంగణంలో మహిళా అధికారులు ఉన్నారనే సోయ కూడా లేకుండా బనియన్లు ఇప్పి ప్రవర్తించడం, పోలీసులపై బూతులతో విరుచుకుపడటం బీఆర్ఎస్ నేతల సంస్కారరాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ప్రధాన డిమాండ్లు:
- స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఎమ్మెల్సీ తాతా మధు, కేటీఆర్, హరీశ్రావులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
- స్పీకర్ను తీవ్ర పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే పదవి నుండి భర్తరఫ్ చేయాలి.
దళితులపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని, ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలను వీరేందర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, వాసు వరగాని తదితర కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

