బాల్కొండ: తెలంగాణ ఉద్యమ కాలం నాటి చీకటి రోజులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దాపురిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి ఉద్యమ సమయంలో రైతులు కరెంట్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 18 కొత్త సబ్స్టేషన్లు, 45 భారీ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రోజుకు కనీసం 11 గంటల విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేయలేకపోతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల మళ్లీ వ్యవసాయ రంగానికి విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

